దిగొచ్చిన పసిడి ధరలు
- 10 గ్రాములకు రూ. 1.35 లక్షలు
- కిలో వెండి రూ. 2.01 లక్షలు
- ట్రంప్ ప్రకటన.. నిధులను మళ్లిస్తున్న పెట్టుబడిదారులు
న్యూఢిల్లీ, మార్చి 23: గత కొద్దిరోజులుగా కొండెక్కిన బంగారం ధరలు కాస్త పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలతో భారీగా కిందకు దిగి వస్తున్నాయి. సోమవారం ఐబీజెఎ (ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్) ప్రకారం 10 గ్రాముల బంగారం ధర (24కె) రూ. 12,077 తగ్గి రూ. 1.35 లక్షలకు చేరుకుంది. అదే సమయంలో కిలో వెండి ధర రూ. 30,864 తగ్గి రూ. 2.01 లక్షలకు దిగి వచ్చింది.
ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా గత 24 రోజుల్లో పసిడి ధర రూ. 23, 956, వెండి రూ. 65,200 తగ్గింది. బలమైన డాలర్, లాభాల స్వీకరణ, దేశంలో తగ్గిన కొనుగోళ్లు, వడ్డీ రేట్ల ప్రభావం పసిడి ధరలు తగ్గేందుకు ప్రధాన కారణంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదురోజులపాటు దాడులు చేయబోమని ప్రకటించడంతో పెట్టుబడిదారులు పసిడి నుంచి ఇతర మార్గాల వైపు నిధులను మళ్లీస్తున్నారు. ప్రస్తుతం ధరలు దిగివస్తున్నా భవిష్యత్ లో బంగారం 10 గ్రాములకు రూ. 2 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.




