సంతానోత్పత్తికి ‘స్మార్ట్’ ముప్పు
అంతర్జాతీయంగా పడిపోతున్న జననాల రేటు
ఆసియా, యూరప్ ఖండాల్లో పరిస్థితి ఆందోళనకరం
జనాభా స్థిరీకరణ ఫార్ములా ‘౨.1’ కంటే తగ్గుతున్న నిష్పత్తి
చైనాలో 1.02, జపాన్లో 1.23కి పడిపోయిన జననాలు
భారత్లో పరిస్థితి కాస్త మెరుగు.. రెండేళ్ల నుంచి ౨.౦ నమోదు
న్యూఢిల్లీ, మే 18: ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు వేగంగా పడిపోతున్నది. మునుపటి రోజులతో పోలిస్తే ఇప్పుడు సంతానోత్పత్తి రేటు తగ్గతూ వస్తున్నది. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నది. ఒకప్పుడు జనాభా విస్ఫోటనం ప్రమాదకరమని కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన దేశాలే, ఇప్పుడు సంతానోత్పత్తి పడిపోతున్నదని ఆందోళన చెందుతున్నాయి.
ముఖ్యంగా ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ సంక్షోభం భవిష్యత్తులో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల దెబ్బతిసే ప్రమాదం ఉంది. దేశాల్లో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల జనాభా పెరగడం వల్ల కంపెనీల్లో పనిచేసే శ్రామిక శక్తి తగ్గుతుంది. జపాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తున్నది. జనాభా తగ్గిపోతుండటంతో క్రమక్రమంగా పాఠశాలలు మూతపడుతున్నాయి.
తమ దేశంలో సంతానోత్పత్తి రేట్ పెంచేందుకు మూడు కంటే ఎక్కువ మంది పిల్లలను కనవచ్చని చైనా రాయితీలు ఇస్తున్నది. అయినప్పటికీ యువత నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి కనీసం 2.1 ఉండాలి. కానీ, దక్షిణ కొరియా, చైనా, థాయ్ల్యాండ్, జపాన్ వంటి దేశాల్లో అమాంతం పడిపోయింది. గతేడాది దక్షిణ కొరియాలో రేటు 0.75, చైనా 1.02, థాయ్ల్యాండ్ 1.19, జపాన్లో 1.23 నమోదు కావడం గమనార్హం. ఇక భారత్ విషయానికొస్తే సంతానోత్పత్తి రేటు 2.0గా ఉంది. గతేడాది కూడా అదే నిష్పత్తి నమోదైంది.
అసలు కారణాలేంటి?
రోజురోజుకూ జీవన వ్యయాలు పెరుగుతుండటంతో దంపతులు ఆలస్యంగా పిల్లలు కందామనుకోవడం, వృత్తి జీవితంలో పడి యువతీ యువకులు లేటు వయస్సులో పెళ్లిళ్లు చేసుకోవడం, మగవాళ్లు డ్రగ్స్, మద్యం, ధుమపానం వంటి దుర్వ్యసనాలకు బానిసవడం వంటివి సంతానోత్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ అతిపెద్ద కారణమని హెచ్చరిస్తున్నారు.
2007 నుంచి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత మానవ సంబంధాలు తగ్గుతూ వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. గడిచిన దశాబ్దం నుంచైతే జంటల మధ్య మానసికంగా దూరం పెరుగుతూ వస్తుందని చెబుతున్నారు. దంపతుల్లో ఎవరికి వారు వేర్వేరు డిజిటల్ ప్రపంచాలు సృష్టించుకుంటున్నారని, ఈ పరిణామం వారి మధ్య ప్రేమానురాగాలను తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ జనాభా సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
సమయమంతా మొబైల్ స్క్రీన్తోనే
సోషల్మీడియా ప్రభావం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది వాటితోనే టైంపాస్ చేస్తున్నారు. ఈ పరిణామం జంటల మధ్య శారీరక, మానసిక దూరం పెరిగేందుకు కారణమవుతున్నది. నాలుగు దశాబ్దాల క్రితం భారతదేశంలో ఒక్కో మహిళ సగటున 3 నుంచి 4 మంది పిల్లలు కనేది. ఇప్పుడా సంఖ్య ఒకరు లేదా ఇద్దరికి పరిమితమైంది. ఈ పరిణామం ఒక్క భారత్లోనే కాదు.. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి.
ఇంకొన్ని దేశాల్లోనైతే దంపతులు కంటే ఒక్కర్ని కందాం.. లేదంటే.. అసలు పిల్లలే వద్దు అనే కఠిన నిర్ణయం తీసుకుంటుకున్నారు. కరోనా తర్వాతి పరిణామాల కారణంగా నూతన దంపతుల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. సాంకేతికత ఎక్కువగా వినియోగించడం వల్ల మగళవాళ్లలో శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం, స్త్రీలల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి సమయానికి అండం విడుదల కాకపోవడం వంటి సమస్యలు తలెత్తతున్నాయి.
ఇతరులతో పోల్చుకోవడం పెద్ద సమస్య
సోషల్ మీడియాలో ఎక్కువ కంటెంట్ ఎవరెవరో సంపన్నులు, సెలబ్రెటీస్ చేసిన పోస్ట్ చేసిన పోస్టులకు సాధారణ పౌరులు కూడా ఆకర్షితులవుతున్నారు. వారి విలాసవంతమైన జీవితాలతో తమ జీవితాలనూ పోల్చుకుంటున్నారు. అలా గాలిలో పేకమేడలు కట్టే దుష్పరిణామాలు ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నాయి.
యువతీ యువకులు ప్రేమానుబంధాల కంటే కెరీర్, డబ్బు, కీర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థికపరంగా అభద్రతాభావానికి గురవుతున్నారు. వృత్తి జీవితంలో ఉన్న ఒత్తిళ్లను బ్యాలెన్స్ చేయలేక కుదుపులకు లోనవుతున్నారు. మొత్తంగా ఇవన్నీ.. జంటల మధ్య దూరం పెంచుతున్నాయని మానసిక విశ్లేషకులు, సంతాన సాఫల్య వైద్య నిపుణులు చెబుతున్నారు.
విభిన్నమైన ఆలోచనలు.. ఉద్యమాలు
కొన్ని దేశాల్లో దంపతులు ఇదొక పాపపు లోకమని, ప్రపంచమంతా కాలుష్యంతో నిండిపోయిందని, మనిషి బతకాలంటే జీవి తాంతం ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాలనే భావనతో పిల్లల కనకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఒక ప్రాణిని భూమి మీదకు తీసుకురావాల్సిన అవసరం లేదనే తాత్తిక చింతన కూడా కొందరిలో మొదలైంది. అంతర్జాతీయంగా ఈ ఆలోచనా విధానం ఆందోళన రేపుతున్నది.
దీనికి ‘యాంటీనాటలిజం’ అనే పేరు ఖరారైంది. ఇంకొన్ని జంటలైతే భవిష్యత్తు తరాలకు అనుకూలమైన వాతావరణం భూమిపై లేదని, తమకు ఆర్థికపరమైన భద్రత కూడా లేదని.. అలాం టప్పుడు పిల్లలు కనడం బాధ్యతారాహిత్యమని వాదిస్తున్నారు. వారి వాదనను ఒక ఉద్యమంగా పేర్కొంటున్నారు. దానికి ‘బర్త్ స్ర్టైక్’ అనే పేరు కూడా పెట్టి సోషల్మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
సంతానోత్పత్తి పడిపోతున్న తరుణంలో దంపతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. బెడ్రూంలోకి స్మార్ట్ఫోన్లు వినియోగించకుంటే మంచిది. భార్యాభర్తలిద్దరూ స్మార్ట్ ఫోన్ వినియోగం కంటే ముఖ్యంగా జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని పెంచుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టులకు ప్రభావితం కాకూడదు. ఇతర జంటల విలాసవంతమైన జీవితాలను చూసి కుంగిపోవద్దు. సాంకేతికతను కేవలం అవసరాలకే పరిమితం చేయాలి. అప్పుడే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు. జీవితాన్ని ప్రేమానురాగాల మధ్య గడపే అవకాశం ఉంటుంది.






