చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని
- ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి, మార్చి 26 (విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం లో నీటి సమస్య ఉందని, సమస్యను పరిష్కరించడానికి కొండగట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తిచేయాలని కోరారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే కొండగట్టుతో పాటు పక్కనే ఉన్న జేఎన్టీయూ కళాశాల, పలు గ్రామాలకు త్రాగునీటికి ఇబ్బంది ఉండదని సభ దృష్టికి తీసుకువచ్చారు.
చొప్పదండి నియోజకవర్గంతో పాటు, వేములవాడ నియోజకవర్గానికి సాగునీరు అందించే నారాయణపూర్ రిజర్వాయర్ నీటితో నింపిన క్రమంలో కట్ట కింద ఉన్న గ్రామస్తులు నిత్యం పాములు, తేళ్లు, విష కీటకాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కట్ట ఎత్తు పెంచడంతోపాటు, నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందజేయాలని, నారాయణపూర్ కుడి కాలువను పూర్తిచేయాలని కోరారు. రామడుగు మండలంలోని మోతే, రంగసాయిపల్లి, రుద్రారం గ్రామాల రోడ్డు పూర్తిగా దెబ్బతిందని, రోడ్డు మరమ్మతుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు.




