జవహర్ నగర్ లో పేదలకు ఉచిత వైద్య శిబిరం
జనహిత, లయన్స్ క్లబ్, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో పేదలకు ఉచితంగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు జనహిత సేవా ట్రస్ట్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, బంజారా పెరల్స్, కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం డబుల్ బెడ్ రూమ్ కాలనీలో గరీబోళ్లకు ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ గరీబోళ్లను ఆదుకుంటేనే, సమాజంలో తద్వారా దేశంలో మంచి గుర్తింపు లభిస్తుందని, పేదల కోసం జవహర్ నగర్ లో కంటిన్యూగా రాబోయే రోజుల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు.
జవహర్ నగర్ లో పేద ప్రజలే ఎక్కువగా నివసిస్తున్నారని , మినీ భారత్ గా పేరుగాంచిన జవహర్ నగర్ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు నిలయమని ఎక్కువగా జవహర్ నగర్ లో పేదలు మధ్యతరగతి ప్రజలు జీవిస్తున్నారని వారి ఆరోగ్య రక్షణ కోసం ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని, ఆరోగ్య జవహర్ నగర్ లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. డంపింగ్ యార్డ్ కు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో ప్రజలు ఆరోగ్య రక్షణ పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహమూర్తి, జయమోహన్, సునీతారెడ్డి, శాంత కుమారి వైద్యులు తదితరులు పాల్గొన్నారు.




