ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి
- ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల బంద్
గజ్వేల్,(విజయ క్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గజ్వేల్లో ప్రభుత్వ జూనియర్, డిప్లమా, మోడల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మంగళవారం బంద్ నిర్వహించారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవులపల్లి మహేందర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో రూ.11 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. దీంతో వేలాది మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, చదువులు మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.






