4 March, 2026 | 4:33 PM

యూరియా కోసం రైతుల ఆందోళన

04-03-2026 02:49 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): మహమ్మద్ నగర్ మండలంలోని గునుకుల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం మహమ్మద్ నగర్  వద్ద బుధవారం ఉదయం యూరియా కొరతతో రైతులు ఆందోళనకు దిగారు. సొసైటీ గోదాంకు ఉదయం 666 యూరియా బస్తాలు చేరుకున్నట్లు సమాచారం అందడంతో రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. రైతులు యూరియా యాప్‌లో బుకింగ్ చేసుకునేందుకు సిద్ధమయ్యేలోపే నిమిషంలోనే మొత్తం 666 బస్తాలు ఖాళీ అయినట్లు యాప్‌లో చూపించడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తమకు యాప్‌లో స్టాక్ లేదు అని చూపెడుతుండగా, ఈ బస్తాలు ఎవరికి బుక్ అయ్యాయి ఎక్కడికి వెళ్లాయి అనే ప్రశ్నలతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు అధికారుల కోసం వేచి చూసినప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి రాలేదని రైతులు ఆరోపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా ఆగ్రహించిన రైతులు సొసైటీ అధికారులను నిలదీసే క్రమంలో కార్యాలయ క్యాబిన్‌కు గల అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. అనంతరం సొసైటీ అధికారులు రైతులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. యూరియా సరఫరా, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.