ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన
టీఎంసీ గెలువబోతోంది:
ఎన్నికల ఫలితాల సరళిపై మమతా బెనర్జీ స్పందన
కోల్కతా: ఎన్నికల ఫలితాల సరళిపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) స్పందించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల నుంచి టీఎంసీ నేతలు వెళ్లవద్దని సూచించారు. 2026 బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ(West Bengal election results 2026) గెలువబోతోందని మమత పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 నుంచి 4 రౌండ్ల లెక్కింపే జరిగిందని ఆమె తెలిపారు. చాలాచోట్ల 14 నుంచి 18 రౌండ్ల వరకు లెక్కింపు కొనసాగుతోందని వివరించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీఎంసీనే విజేతగా నిలుస్తోందని జోస్యం చెప్పారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన పనిలేదని మమతా బెనర్జీ వెల్లడించారు.
పథకం ప్రకారమే బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు చూపుతున్నారని ఆరోపించారు. చాలా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఆపేశారని చెప్పారు. టీఎంసీ నేతలను కేంద్ర బలగాలు వేధిస్తున్నాయని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ఆధారంగా ఓట్లు దొంగిలించే ప్రయత్నం జరిగిందని తెలిపారు. టీఎంసీ.. వందకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నా ప్రకటించట్లేదన్నారు. అన్నీ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. ఓట్ల లెక్కింపులో ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర బలగాలు.. ఈసీతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.






