30 May, 2026 | 2:48 AM

రైతుల ఆత్మహత్యాయత్నం

30-05-2026 12:34 AM
  1. డీజిల్ ఒంటిపై పోసుకుని ఒకరు, పురుగుల మందు తాగి మరొకరు..
  2. కొనుగోళ్లలో జాప్యమే కారణం

హనుమకొండ, మే 29 (విజయక్రాంతి)/సిద్దిపేట రూరల్/చేగుంట: ధాన్యం కొనుగో ళ్లలో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొం డ జిల్లా హసన్‌పర్తి మండలంలోని మడిపెల్లి ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం ముంజ శ్రీనుగౌడ్ అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశా డు. గమనించిన సహచర రైతులు అడ్డుకున్నారు.

నాలుగు రోజులుగా ధాన్యం రవాణా నిలిచిపోయిందని, రైతుల గోడు పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని మక్కరాజుపేట (సాల్కొని చెరువు తండా) గ్రామానికి చెందిన లంబాడి భిక్షపతి రైతు కొనుగోలు కేంద్రం వద్ద పరుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు స్పందించి, ఆయనను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైతు చికిత్స పొందుతున్నాడు. 

ధాన్యం కొనాలని ఆందోళన

ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వేగం పెంచి తమను ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా పుల్లూరు, బండ చర్లపల్లి గ్రామాల రైతులు కోరారు. శుక్రవారం సిద్దిపేట, ముస్తాబాద్ రహదారిపై పుల్లూరు గ్రామం వద్ద ధర్నా నిర్వహించారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి నేలపాలవుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత ఉందని, లారీలు రావడం లేదని అన్నారు. తూకం వేసేందుకు వెళ్తే, మిల్లర్లు సంచికి మూడు కిలోలు తొలగిస్తున్నారని ఆరోపించారు. రైతుల ధర్నాతో రెండు కిలోమీటర్లకు పైగా భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఎంఆర్‌ఓ అబ్దుల్ హమీద్ చేరుకొని లారీల కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.