రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి.. రూ.5 లక్షల బీమా పథకం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి రూ 5 లక్షల బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం పాత పాలమూరులోని 10 వ డివిజన్ లో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వార్డు సభ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం కలుగుతోందన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. పేద, బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు భరోసా కలుగుతుందని చెప్పారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందిస్తూ, కుటుంబం లోని ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యా రంగంలో భాగంగా నాణ్యమైన విద్య అందించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. పెన్షన్లు అందని అర్హులైన వారికి కూడా త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పేదలకు సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
నగరంలోని పాత పాలమూరు ప్రాంత అభివృద్ధి కోసం దశలవారీగా పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను తమ కార్పొరేటర్ ద్వారా తెలియజేస్తే వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డివిజన్ లోని మహిళలకు ఆయన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ , నగర మేయర్ గుమ్మాల మమత గారు, డిప్యూటీ మేయర్ సురేందర్ , పదవ డివిజన్ కార్పొరేటర్ రమేష్ బాబు, అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




