14 July, 2026 | 4:11 AM

ఫారం ఇవ్వకుంటే ఓటు హక్కు గల్లంతే..

14-07-2026 01:46 AM

మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి

ఆమనగల్లు, జులై 13 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్ 2026)లో భాగంగా ఆమనగల్ మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఏఈఆర్‌ఓ, మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేశారు.ఓటర్లు ఫారాలను తిరిగి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని గమనించిన కమిషనర్, తక్షణమే పట్టణంలో ఆటోల ద్వారా మైక్ అనౌన్స్మెంట్లు ఏర్పాటు చేయించారు.

మున్సిపల్ సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు సేకరించేలా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే బీఎల్‌ఓలకు లేదా మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని, లేనిపక్షంలో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు  చొరవ చూపాలని కమిషనర్ కోరారు.