23 July, 2026 | 3:05 AM

గురుకుల విద్యాలయాల్లో సదుపాయాలు పెంచాలి

23-07-2026 02:03 AM
  1. ఆకస్మికంగా తనిఖీ.. విద్యార్థులతో భోజనం 
  2. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి 

నిర్మల్, జులై 22 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన గురుకుల విద్యాసంస్థల్లో సదుపాయాలు పెంచాలని బి జె ఎల్ పి నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.  బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, వంటశాల నిర్వహణ, ఆహార నాణ్యతను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి, వారికి వడ్డిస్తున్న భోజనం రుచి, నాణ్యతపై స్వయంగా ఆరా తీశారు.

విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, వసతి, రోజువారీ అవసరాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసతిగృహంలోని ఒక గదిలో 25 మంది విద్యార్థులు ఉండాల్సి వస్తోందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎంజేపీ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తానని తెలిపారు.

పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆకస్మిక తనిఖీతో విద్యార్థులు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించే అవకాశం లభించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, పార్టీ నాయకులు చంద్రకాంత్. ప్రిన్సిపల్ జీవన్ అధ్యాపకులు పాల్గొన్నారు.