19 June, 2026 | 2:58 PM

భూముల సర్వేకు వేగవంతమైన చర్యలు

19-06-2026 01:43 PM

కలెక్టర్ కె. హరిత 

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లాలో నకలు లేని గిరిజన భూములు, సదా బైనామా దరఖాస్తులు, భూ సంబంధిత పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. హరిత తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో కలిసి భూముల సర్వే పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామాల్లో భూ సమస్యలను గ్రామాల వారీగా గుర్తించి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

సర్వే నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన సిబ్బందిని సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని సూచించారు.సదా బైనామా దరఖాస్తులను నెలాఖరులోగా పరిశీలించి అర్హులైన వారికి త్వరితగతిన పరిష్కారం అందించాలని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని కలెక్టర్ తెలిపారు. భూ హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పేర్కొన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.