కో ఆప్షన్ వైపు మాజీల చూపు..
మార్చిలో సభ్యుల ఎంపిక
ఆ తర్వాతే సర్వసభ్య సమావేశం
కరీంనగర్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, రెండు నగరపాలక సంస్థల్లో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మం త్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమా ర్ తోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, కొత్తగా నియమితులైన చైర్పర్సన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా ఏడుగురు సభ్యులు నియమితులయ్యే అవకాశం ఉంది.
రామగుండం కార్పొరేషన్లో ఆరుగురు, ఆయా మున్సిపాలిటీల్లో 10 మంది కౌన్సిలర్లకు ఒక కో-ఆప్షన్ చొప్పున ఎన్నుకోనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉండగా బీజేపీ బలం 30 ఉంది. స్వతం త్రులతో కలిపి 35కు చేరుకుంది. బీజేపీ సభ్యులు నలుగురిని ఎంచుకునే అవకాశం ఉంది. మిగతా ముగ్గురు కాంగ్రెస్, ఎంఐఎం కలిపి రెండు, ఒకరు బీఆర్ఎస్ కు చెందినవారు ఎంపికయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా ఆయా మున్సిపాలిటీల్లో పార్టీల బలాబలాలను బట్టి సభ్యుల ఎంపిక ఉంటుంది.
సాధ్యమైన మేరకు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యే అవకాశాలుండగా కరీంనగర్ లో మాత్రం ఓటింగ్ జరిగే అవ కాశం ఉంది. ముందుగా కో-ఆప్షన్ సభ్యులుగా కాదల్చుకున్నవారి నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు. నిబంధనల మేరకు అర్హత గలవారిని ఎన్నుకుంటారు. పాలకవర్గాలు ఉన్నంతకాలం కో-ఆప్షన్ సభ్యులు కూడా కొనసాగుతారు. కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనడానికి వీరికి అర్హత ఉంటుంది. పాలకవర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది కానీ, తీ ర్మాణాల విషయంలో వీరికి ఓటు వేసే హక్కు ఉండదు.
కో- ఆప్షన్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు మున్సిపల్ కౌన్సిల్ ఓట్ల జాబితాలో రిజిస్టరై ఉండడంతోపాటు 21 సంవత్సరాలకు తగ్గకుండా వయస్సు ఉండాలి. మున్సిపల్ కౌన్సిల్లో చైర్మన్గాగాని, వైస్ చైర్మన్ గాని, కౌన్సిలర్ గా గాని, విలీనం కాక ముందే ఉన్న గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్గా ఐదు సంవత్సరాలకు తగ్గకుండా ఉండాలి. నైపుణ్యం కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లేదా, పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసి గెజిటెడ్ అధికారి హోదాలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు, అంతేకాకుండా వార్డు సభ్యులుగా పనిచేసిన వారు కూడా అర్హులే.
ఇదిలా ఉండగా కో-ఆప్షన్ పదవులు ఆశించేవారు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తమకు ఇ వ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. గతంలో మూడు నాలుగు దఫాలుగా కార్పొరేటర్గా, కౌన్సిలర్గా పనిచేసి ఈసారి ఓటమి పాలైన చాలామంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అలాగే ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేల హామీ మేరకు పోటీ నుండి తప్పుకున్నవారు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.




