విద్యా వ్యవస్థను పటిష్ట పరిచేందుకే విద్యా వారోత్సవాలు
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పంపండి..జిల్లా కలెక్టర్ దీపక్ .
తాండూరు,(విజయక్రాంతి): విద్య వ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకే విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని...ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గాను తగు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి విద్యాధికారులను ఆదేశించారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా ఎంఈఓ ఇందు ప్రియ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు ,కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యాబోధన అందిస్తున్నామని... గతం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఫలితాలు బాగా మెరుగుపడ్డాయని అన్నారు. అనంతరం తాండూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు- శీల్డులను అందజేసి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ , కమిషనర్, తాండూరు తహసిల్దార్ తారా సింగ్, ప్రభుత్వ నెంబర్ వన్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు






