డీఎస్పీ భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డికి రిమాండ్
చంచల్గూడ జైలుకి భీమ్రెడ్డి తరలింపు
హైదరాబాద్: అక్రమ ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి(DSP Bheem Reddy) ఏసీబీ (Anti-Corruption Bureau) కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డి నివాసంతో సహా మొత్తం 15 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో నిర్వహించిన సోదాల సందర్భంగా భారీగా ఆస్తులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
కేసు నమోదు చేసిన అనంతరం, ఏసీబీ అధికారులు సోమవారం అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి, గురువారమే ఆ అరెస్టు జరగాల్సి ఉంది. అయితే, సోదాలు చేయడానికి వచ్చిన అధికారులను చూడగానే భీమ్ రెడ్డి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో అధికారులు ఆయనకు నోటీసు జారీ చేసి వెళ్లిపోయారు. భీమ్ రెడ్డి అరెస్టులో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పలు ఫిర్యాదుల నేపథ్యంలో, సోమవారం సాయంత్రం భీమ్ రెడ్డిని ఎట్టకేలకు అరెస్టు చేశారు.






