మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం: ఐదుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని(Madhya Pradesh) మైహార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Road Accident) ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా దూసుకెళ్తున్న వారి ఎస్యూవీ (SUV) కారు, అటుగా వెళ్తున్న ఒక ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అమర్పటాన్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని మైహార్కు తిరిగి వస్తుండగా, 'దేహత్' పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-30పై ఉన్న రిగ్రా గ్రామం సమీపంలో రాత్రి సుమారు 1 గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆ ఎస్యూవీ కదులుతున్న ట్రక్కును వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఆ ఢీకొన్న ధాటికి కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న ఆరుగురు బాధితులు వాహనంలోనే చిక్కుకుపోయారు.
ఐదుగురు అక్కడికక్కడే స్పాట్ డెడ్
ఈ దుర్ఘఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మొదట అమర్పటన్ సివిల్ ఆసుపత్రికి తరలించారని, అయితే పరిస్థితి విషమించడంతో సత్నా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారని దేహత్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంచ్రాజ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, హైవే పెట్రోల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన ఐదుగురు మరణించిన యువకులను బయటకు తీశారు. మరణించిన వారిని అంకుర్ పటేల్ (40), మృదుల్ పటేల్ (32), విజయ్ పటేల్ (30), హరిశంకర్ పటేల్ (25), శివ పటేల్ (23)గా గుర్తించారు. ఐదు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం మైహార్ ఆసుపత్రి శవగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
మృతులు స్థానిక కాంగ్రెస్ నాయకుడి బంధువులు
ఈ విషాదకరమైన ప్రమాదం తర్వాత మృతుల కుటుంబాల్లో గందరగోళం నెలకొనగా, ఆ ప్రాంతమంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన వారందరూ అమర్పటాన్ జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్ పటేల్ పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు మనోజ్ పటేల్ బావమరుదులని సమాచారం. అలాగే, మరణించిన, గాయపడిన వారందరూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు మనీష్ పటేల్ సోదరులని తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.






