మునిపల్లి ప్రైమరి స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా తనిఖీ బృందం
మునిపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన మునిపల్లి ప్రైమరి స్కూల్ ను శుక్రవారం నాడు జిల్లా నోడల్ అధికారి సురేష్, జిల్లా రిసోర్స్ పర్సన్ వల్లభ్ జోషిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి రెండు సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన తొలి మెట్టు, ఈ సంవత్సరం ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమాల ప్రవేశ పెట్టిందన్నారు.
అలాగే ఈ విద్యాసంవత్సరంలో ప్రతి వంద పాఠశాలలకు గాను ఒక తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన పట్ల, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇంకా మెరుగైన బోధన కోసం పాఠశాల ఉపాధ్యాయులకి తగు సలహాలు, సూచనలు అందించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తనిఖీ బృంద సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ కుమార్, ఉపాధ్యాయులు మధురిమ, కవిత, అరుణకుమారి, చంద్రమౌళి, బుష్రా, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.




