మహిళలకు చీరలు పంపిణీ
ఆదర్శంగా నిలిచిన మండల తహసిల్దార్
మందమర్రి (విజయక్రాంతి): పూలను దేవతగా కొలిచి పూజించే బతుకమ్మ పండుగ పురస్కరించుకొని మహిళలకు చీరలు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు మండల తహసిల్దార్ పి సతీష్ కుమార్. తన కూతురు మనస్విని జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా సోమవారం రెవెన్యూ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన మహిళలకు చీరలను కానుకగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలను దేవతగా పూజించే, తెలంగాణ ఆడబిడ్డల పూల పండుగ బతుకమ్మ పండుగ, తన కూతురు జన్మదినం రెండు ఒకే రోజు రావడంతో ఆడపడుచులు ఎంతో సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కార్యాలయంకు వచ్చిన మహిళలకు చీరలు అందించడం ఎంతో తృప్తి నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా మనస్వినికి పలువురు మహిళలు ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణపతి రాథోడ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






