అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్ల పదవులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ గండుగులపల్లి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. చైర్మన్ పదవికి 10 మంది, డైరెక్టర్ పదవులకు 20 మంది పైగా ఆసక్తి ఉన్న వారి వివరాలతో కూడిన ప్రతిపాదనను దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కక్కిరాల రమేష్ ఎమ్మెల్యే జారేకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఒక్కొక్క పదవికి ఎంత మంది ఆసక్తి చూపిన ఒక్కరికే ఇవ్వగలమని, నేను ఫైనల్ చేసి పంపితే మీకు నచ్చదు అని మీరందరూ వస్తే చర్చించి మీకు ఫైనల్ చేసే ప్రాసెస్ మరియు పరిశీలన ఎలా ఉంటది అని మీ అందరికీ తెలియజేయడానికి సమావేశం నిర్వహిస్తున్నాననీ అన్నారు. తన అభిప్రాయంకి వస్తే రైతు అయి ఉండి రాజకీయం చేసే వారికి, పార్టీకి పనిచేస్తూ ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమం ఉన్నా పాల్గొంటూ, పార్టీకి అండగా ఉంటూ, పార్టీని బతికించే వారికి ఇస్తే బాగుంటుందన్నారు. అలాంటి వారిని మీరు సెలెక్ట్ చేస్తే చాలా బాగుంటుందన్నారు.
ఇప్పటికే ఆత్మ కమిటీ తదితర వాటిల్లో పదవులు పొందిన వారు చాలా వరకు సమావేశాలకు రాకపోగా, ఒకవేళ వచ్చిన సమావేశం అయ్యే వరకు ఉండలేని పరిస్ధితి చూస్తున్నానని, రాష్ట్రంలో 7వ స్థానంలో అభివృద్ధి ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గం, పార్టీ విషయంలో ముప్పై శాతం పైగా వెనక పడి ఉందని, పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తే పార్టీ మరింత పటిష్టం అవుతుందని, ఆశావహుల వివరాలను జిల్లా, రాష్ట్ర స్థాయి పరిశీలన జరుగుతుందని అన్నారు.






