రైతులకు జీలుగు, జనుము విత్తనాల పంపిణీ
మునిపల్లి, మే 21(విజయక్రాంతి): మండలంలోని తాటిపల్లి ఏఆర్ ఎస్ కె కేంద్రంలో గురువారం రైతులకు జనుము, జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏవో అనితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ లు పాల్గొని మాట్లాడారు. వానాకాలం సాగును దృష్టిలో ఉంచుకుని రైతులకు సబ్సిడీపై పచ్చి ఎరువు విత్తనాలను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే భూసారాన్ని పెంపొందించడానికి, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు జీలుగ, జనుము పంటలు ఎంతో ఉపయోపడతాయన్నారు.
రైతులు ఈ పచ్చి ఎరువు పంటలను సాగు చేసి భూమి సారాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉన్నాయని, రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్తో విత్తనాలను పొందాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధికారిక కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రైతులు పంటల దిగుబడులు పెంచుకునేందుకు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దచెల్మెడ పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెద్దలోడి విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు సంగన్న, వెంకట లక్ష్మారెడ్డి, మక్సూద్ పటేల్, గ్రామ సర్పంచ్ రాములు, పీఏసీఎస్, ఏఎంసి డైరెక్టర్లు సంజీవ్ రెడ్డి, మహిపాల్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.






