23-02-2026 12:32:45 AM
చండూరు, ఫిబ్రవరి 22 : మండల పరిధిలోని ధోని పాముల నుండి నేర్మట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అతి ప్రమాదకరంగా ఉంది. ఈ విషయంపై అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. రోడ్డు పక్కన ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ఉండడం వల్ల రాత్రి వేళల్లో ఈ రోడ్డు వెంట ప్రయాణించాలంటే వాహనదారులు బిక్కు బిక్కు మంటూ ప్రయాణిస్తుంటారు.
ఈ ప్రధాన రోడ్డు వద్ద ఈ ట్రాన్స్ఫార్మర్ చేతికందే ఎత్తులోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫార్మర్ అతి ప్రమాదకరంగా ఉందని ఎన్నోసార్లు అధికారులను వేడుకున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్ మరొక చోటుకు మారుస్తామని చెప్పారే తప్ప ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని, అక్కడే రోడ్డు కొంచెం దూరంలో ప్రయాణికులకు అనుకూలంగా, అక్కడున్న రైతులకు కూడా అనుకూలంగా ట్రాన్స్ఫార్మర్ ను మార్చవలసిందిగా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వల్లన ఏమైనా జరిగితే అధికారులే బాధ్యత వహించవలసి వస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.