21 March, 2026 | 3:16 AM

ఐటీ రంగానికి రూ. 875 కోట్లు

21-03-2026 01:40 AM
  1. గతంతో పోలిస్తే రూ.101 కోట్ల పెరుగుదల
  2. ఇంకా అవసరమే అంటున్న విశ్లేషకులు

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి) : రాష్ట్ర బడ్జెట్‌లో ఐటీ రంగానికి ఈసారి నిధుల కేటాయింపు స్వల్పంగా పెరిగింది. 2026 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగానికి ప్రభుత్వం రూ. 875 కోట్లు కేటాయించగా, గత ఏడాది ఇది రూ. 774 కోట్లుగా ఉంది. ఈ మేరకు రూ. 101 కోట్ల పెరుగుదల నమోదైంది. శాతాల పరంగా చూస్తే, ఈ పెంపు సుమారు 13 శాతం వరకు ఉండటం గమనార్హం.

ఐటీ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయింపులు పెంచడం సానుకూలంగా భావిస్తున్నప్పటికీ, పరిశ్రమ వర్గాలు మాత్రం ఈ పెంపును సరిపడినంత కాదు అని అభిప్రాయపడుతున్నాయి. ప్రత్యేకంగా హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మరింత బలోపేతం చేయాలంటే, స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధికి మరింత భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతర మెట్రో నగరాలతో పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఐటీ రంగానికి కేటాయింపులు మరింత దూకుడుగా ఉండాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఐటీ విస్తరణను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా నిధులు పెంచుతున్నట్టు సంకేతాలు ఇస్తోంది. చిన్న పట్టణాల్లో కూడా ఐటీ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగపడే అవకాశముంది.   భవిష్యత్తులో తెలంగాణను అంతర్జాతీయ టెక్ హబ్‌గా నిలబెట్టాలంటే, మరింత పెద్ద స్థాయిలో కేటాయింపులు అవసరమనే చర్చ ఈ బడ్జెట్‌తో మళ్లీ ముందుకు వచ్చింది.