హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు
- హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14మంది హిజ్రాలకు కౌన్సెలింగ్..
- వివాహాలు, శుభకార్యాలయాల్లో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కేసులు నమోదు
- హుజూర్ నగర్ సీఐ చరమందరాజు
హుజూర్ నగర్: హిజ్రాల ఆగడాలు నివారించేందుకు పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు తెలిపారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో హిజ్రాలకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 14 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివాహాలు, శుభకార్యాలు, ఇతర ప్రజా ప్రదేశాలలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, నేర పూరిత చర్యలకు దిగుతూ ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు డబ్బు వసూలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
చట్టానికి లోబడి, సమాజంలో అందరిలా సాధారణ జీవన విధానాన్ని అనుసరించాలని సూచించారు.శుభ కార్యాలు, వ్యాపార సంస్థలు, ఇళ్లకు వెళ్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ,నేర పూరిత చర్యలకు దిగుతూ బలవంతపు డబ్బు వసూలు చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడినట్లయితే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కేసులు నమోదు చేయాలని ఎస్హెచ్ఓలకు ఆదేశించినట్లు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లయితే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు అని తెలిపారు. హిజ్రాల ఆగడాలను నివారించేందుకు పోలీస్ శాఖ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పలు సూచనలు చేసిందన్నారు. చట్టాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యస్ఐ చలికంటి నరేష్,పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






