పాత నేరస్తులకు కౌన్సెలింగ్
శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే కఠిన చర్యలు : సీఐ జలంధర్ రెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): పాత నేరస్తులు ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠినమైన చర్యలు తప్పవని మేడిపల్లి సీఐ జలంధర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్ లో పాత నేరస్తులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రౌడీ షీటర్ల ప్రస్తుతం నిర్వహిస్తున్న విధుల పట్ల ఆరా తీశారు. వారి కుటంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ.. పాత నేరస్తులు తమ ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సలహాలు ఇచ్చారు.
అనవసరపు వివాదాల్లో తలదూర్చొద్దని, సెటిల్మెంట్లు చేయడం వంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. శాంతిభద్రతలు, ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛలను గౌరవించాలని, మానవ హక్కులను భంగం కలిగిస్తూ దాడులకు పాల్పడవద్దని హితవు చెప్పారు. తమ తీరు మార్చుకోకపోతే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని తెలిపారు. పాత నేరస్తులపై ఎప్పటికప్పుడు పోలీస్ నిఘా ఉంటుందని అన్నారు. బైండోవర్ కాలంలో ఏదైనా నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని అన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.






