ప్రైవేట్ కళాశాలలు నిర్వహించడంపై ABVP నిరసన
ప్రైవేట్ కళాశాల నిర్వాహకులు
విద్యార్థులకు మధ్య తోపులాట
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు
లక్ష్మీదేవి పల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సెలవ రోజుల్లో ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు తరగతులు నిర్వహించడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండించింది. శనివారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని కృష్ణవేణి కళాశాల నిబంధనలు ఉల్లంఘిస్తూ తరగతి నిర్వహిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యాన్ని కలిసి విన్నవించేందుకు వెళ్లిన తమపై దుర్భాషలాడుతూ దాడికి చేయడాన్ని తప్పుపడుతూ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. ముందుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళాశాల వైఖరిని ఎండ గడుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ కేవలం వ్యాపార దృక్పథంతో, విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతూ క్లాసులు నిర్వహించడాన్ని ప్రశ్నించినందుకు కళాశాల నిర్వాహకులు దాడికి దిగడం హేయమైన చర్య అన్నారు. నిరంకుశత్వ విద్యా విధానాన్ని అవలంబిస్తున్న కృష్ణవేణి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకుల నుంచి సెల్ ఫోన్లు సైతం లాక్కున్నారు.






