రాహుల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన
అశ్వాపురం,(విజయక్రాంతి): లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు మాట్లాడుతూ... ప్రశ్నపత్రాల లీకేజీలపై విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున ప్రశ్నించిన రాహుల్గాంధీని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులు, కేసులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెట్టలేరని, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.






