20-02-2026 04:51:16 PM
సనత్నగర్,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. అమీర్పేట మైత్రీవనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లోని కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమీర్పేట, ఎస్ఆర్నగర్ నిత్యం బిజీగా ఉండే ప్రాంతాలని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకుండా ముందస్తు తనిఖీలు చేపట్టి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారన్నారు. నిచ్చెనల సహాయంతో నాలుగో అంతస్తు బాల్కనీలో నిలబడి సహాయం కోరుతున్న విద్యార్థులను ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని తెలిపారు.
ముఖాలకు ముసుగులు ధరించి, దట్టమైన పొగ మధ్య సిబ్బంది ధైర్యంగా లోపలికి ప్రవేశించి రక్షణ చర్యలు చేపట్టారని.. అప్రమత్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలు మరింత వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారని వెల్లడించారు. మరోవైపు నగరంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నా వాటిని నియంత్రించడంలో నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలను కోట నీలిమ ఖండించారు.
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరేం చేశారని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో బాధితులకు ధైర్యం చెప్పి సంఘీభావం తెలపాల్సింది పోయి ఇలా రాజకీయ విమర్శలు చేయడం ఏంటని ఫైరయ్యారు. దొరికింది కదా అని ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకోవడం తలసానికి తగదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి స్వభావాన్ని మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ప్రమాదం గురుంచి తెలియగానే వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైడ్రా సిబ్బంది, ఫైర్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.