30 మంది దివ్యాంగులకు కాంప్లిమెంటరీ పాసులు
హైదరాబాద్, ఏప్రిల్ 14: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఎ) దివ్యాంగుల విషయంలో తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఐపీఎల్ వినోదాన్ని దివ్యాంగులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతీ మ్యాచ్కూ 30 కాంప్లిమెంటరీ పాసులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా 30 మంది దివ్యాంగులకు ఉచితంగా పాసులు ఇచ్చి ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం కల్పించింది. హెచ్సీఎ సెక్రటరీ, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు మన్నె జీవన్ రెడ్డి దివ్యాంగులతో కలిసి గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ను వీక్షించారు.
ఐపీఎల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం రావడంతో దివ్యాంగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా హెచ్సీఎ సెక్రటరీ జీవన్ రెడ్డికి, ఇతర సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దివ్యాంగుల పట్ల తమ సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్ లో ప్రతీ ఐపీఎల్ మ్యాచ్ కూ 30 మంది దివ్యాంగులకు ఉచితంగా కాంప్లిమెంటరీ పాసులు అందిస్తామని తెలిపారు. హెచ్ సీఎ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.






