calender_icon.png 17 February, 2026 | 2:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

16-02-2026 12:00:00 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 15(విజయక్రాంతి): నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రత్యేక సమావేశానికి నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుల హోదాలో ఎం.పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో కూడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా స్పెషల్ మీటింగ్ కు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరుగకుండా ఆయా మున్సిపాలిటీల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. కాగా, ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం అవుతుందని, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అన్నారు.

అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్/డిప్యూటీ మేయర్, ఛైర్మన్/వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా మేయర్/డిప్యూటీ మేయర్, ఛైర్మన్/వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్రకుమార్ ఉన్నారు.