మహిళలకు ఎంతో ప్రయోజనం మహాలక్ష్మి పథకం
* హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం డిసెంబర్ 9, 2023 నుండి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా మహిళలు విస్తృతంగా ప్రయాణాలు చేసి ఇప్పటివరకు సుమారు 290 కోట్ల ప్రయాణాలు చేసి దాదాపు ₹10,000 కోట్ల మేర ఆదా చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి పదివేల కోట్ల రూపాయల మేర ఆదా చేరుకోవడం పై హనుమకొండ బస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు జీరో టికెట్ ద్వారా ఉచితంగా ప్రయాణించేందుకు తోడ్పడుతుందని అన్నారు. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకొని ఆర్థికంగా లాభ పడుతున్నారని, ఈ పథకం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందని, అన్ని వర్గాల మహిళలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
కార్యక్రమంలో భాగంగా నిత్యం బస్సుల్లో ప్రయాణించే పలువురు మహిళా ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు శాలువాలు, బహుమతులతో సత్కరించారు. వారిలో మల్లికుదుర్ల నుండి హనుమకొండకు ఉన్నత విద్య కోసం ప్రయాణించే విద్యార్థిని బి కావ్య, స్వీపర్గా పనిచేస్తూ ప్రయాణించే పి భాగ్య, వ్యవసాయ పనుల నిమిత్తం ప్రయాణించే ఎస్. హైమావతి, స్వయం సహాయక సంఘ సభ్యురాలు రంజనా, ఖమ్మం నుండి వైద్య సేవల కోసం నిత్యం ప్రయాణించే జి.రుక్మిణిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ రీజనల్ మేనేజర్ ఎస్ భవాని ప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం. (ఆపరేషన్స్) కేశరాజు భాను కిరణ్, వరంగల్ వన్ డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




