23 March, 2026 | 1:46 PM

హైదరాబాద్ చారిత్రక నగరం.. మానవ తప్పిదాల వల్లే సమస్యలు

23-03-2026 12:01 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) కొనసాగుతున్నాయి. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.... హైదరాబాద్ చారిత్రక నగరం.. అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని సూచించారు. మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఆదాయ మార్గాలు పెరిగి ప్రతి కుటుంబంలో కార్లు పెరిగాయని, ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్లే మెట్రోలు, ఎంఎంటీఎస్ విస్తరించుకున్నామని చెప్పారు.

జైపాల్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నిధులు వచ్చేలా చూశారని కొనియాడారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ గా విభజించి ట్రాఫిక్ రద్దీ తగ్గేలా చూస్తున్నామని వెల్లడించారు. కాలుష్యం వెదజల్లె పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామన్నారు. రోడ్లను అండర్ పాస్ లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు(Metro Expansion) ఎల్ అండ్ టీ ముందుకు రాలేదని, కేంద్రప్రభుత్వ నిబంధన వల్ల మెట్రోను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ. 15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామన్నారు. మెట్రోను మరో 76 కిలో మీటర్లు విస్తరిస్తామని వివరించారు. నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.