మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై కేసు నమోదు
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో(Former MLA Marri Janardhan Reddy) పాటు మరో 38 మంది మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా రాస్తారోకో నిర్వహించి ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగించడంతో పాటు పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో ఈ కేసు నమోదైంది. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఓ కార్యాలయం వైపు చొచ్చుకెళ్లే క్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. కానిస్టేబుల్ దేవేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.






