7 April, 2026 | 3:41 AM

ఢిల్లీ అసెంబ్లీలోకి దూసుకెళ్లిన కారు

07-04-2026 01:46 AM

స్పీకర్ కారుపై సిరా జల్లి.. ఆయన ఆఫీసు వద్ద పూలబొకే పెట్టిన నిందితులు

డ్రైవర్ అరెస్ట్.. పరారైన దుండగులు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఢిల్లీ అసెంబ్లీలోకి దూసుకొచ్చిన ఓ కారు అసెంబ్లీ గేటును ఢీకొట్టి, లోపలికి వెళ్లింది. అనంతరం స్పీకర్ కారుపై దుండగులు సిరా జల్లి.. ఆయన ఆఫీసు వద్ద ఓ పూలబొకే ఉంచారు. ఏం జరిగిందో తెలిసేలోపు తిరిగి కారుతో సహా అక్కడ నుంచి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ అనూహ్య ఘటనతో అక్కడ కలకలం రేగింది. ఢిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పించింది. ఇటీవల అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంతో ఇలా జరగడం గమనార్హం.

ఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం ఓ కారు వేగంగా దూసుకొచ్చి అసెంబ్లీ గేటును ఢీకొట్టింది. అనంతరం వాహనంతో సహా దుండుగులు ప్రాంగణంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బలంగా గేటును ఢీకొట్టడంతో అది విరిగిపడింది. ఇంతలోనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది స్పందించారు. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ కారు వేగంగా శాసనసభ వద్దకు దూసుకొచ్చింది. ముఖానికి మాస్క్ వేసుకుని కారును నడిపిన వ్యక్తి గేటును బలంగా ఢీకొట్టి లోపలికి వెళ్లాడు. తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయాడని వివరించారు.

అయితే, ఆ కారు అసెంబ్లీలోకి ఎందుకు దూసుకువచ్చింది? వాళ్లు ఎవరు? అనేది గుర్తించేందుకు పోలీసులు, భద్రతా అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి బాంబు బెదిరింపుల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఉత్తర్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఆ కారు.. రెండో నెంబరు గేటు వద్దకు వేగంగా వచ్చింది. అయితే, ‘అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు కారుతో సహా వెళ్లిన దుండుగుడు.. వరండా దగ్గర బొకేను పెట్టి వేగంగా వెళ్లిపోయాడు’ అని ఢిల్లీ సచివాలయ అధికారి ఒకరు తెలిపారు. డ్రైవర్ స్పీకర్ కారుపై సిరా కూడా చల్లాడని ఆయన అన్నారు. ఘటన నేపథ్యంలో బాంబు స్క్యాడ్ అక్కడకు చేరుకుని, తనిఖీలు చేపట్టింది. పేలుడు పదార్థాలు లేదా అనుమానిత వస్తువులు లేవని తేల్చింది.