క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
శంకర్ పల్లి, మార్చి13 (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెగా వైద్య శిబిరాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో మెగా వైద్య శిబిరాన్ని ఆసుపత్రి వర్గాల వారు నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో అధికారులు ఎన్నో పనులు ప్రజల కోసం చేపట్టబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా శుక్రవారం జరిగిన మెగా హెల్త్ క్యాంపులో మొత్తం 410 రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
37 మంది మహిళలకు గర్భాశయ ముఖద్వారం పరీక్షలు చేయడం జరిగిందన్నారు. 86 మంది రోగులను వైద్య పరీక్ష చేసి ఏరియా ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరిగిందని చెప్పారు. 42 మంది గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. 167 మంది మహిళలకు ఆరోగ్య మహిళ స్క్రీనింగ్ చేశామని చెప్పారు.
మిగతా వారికి ఎన్సీడీ చేసి వారికి తగిన చికిత్స ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్. ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, శంకర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి చంద్రమోహన్, శంకర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రేవతి రెడ్డి, క్యాంప్ లో పాల్గొన్న డాక్టర్లు లక్ష్మి అన్విత, ఆరిఫ్ ఖాన్, ఉమామహేశ్వరి, రాజేష్, దివ్య రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు,వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.




