చర్చలు సఫలం.. రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్: తమ డిమాండ్లకు మద్దతుగా మూడు రోజుల పాటు సమ్మె(RTC Strike) చేసిన టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు శనివారం ఉదయం నుంచి బస్సులను నడపడం ప్రారంభించారు. దీంతో ప్రయాణికులకు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు ఎంతో ఉపశమనం లభించింది. సమ్మె కారణంగా, అఫ్జల్గంజ్లోని ఎల్లప్పుడూ రద్దీగా ఉండే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (MGBS), జూబ్లీ బస్ స్టేషన్ (JBS), సికింద్రాబాద్లోని రాణిగంజ్ I, II డిపోలతో పాటు ఇతర ప్రాంతాలు గత మూడు రోజులుగా నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో ఉద్యోగులు సమ్మెను విరమించుకున్నారు. దీంతో బస్సులు రోడ్లపైకి వచ్చాయి. తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు, జంట నగరాల్లోని MGBS, JBS ఇతర రద్దీ బస్ స్టేషన్లు ఉదయం నుంచే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు సచివాలయంలో RTC JAC సంఘాలతో చర్చలు జరిపారు. చర్చలు విజయవంతంగా ముగిసిన అనంతరం, సమ్మెను విరమిస్తున్నట్లు JAC నాయకులు ప్రకటించారు. 11 శాతం PRCతో సహా JAC మొత్తం 32 డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా, RTCని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా ఆమోదం తెలిపింది. ఈ మూడు రోజుల ఆర్టీసీ సమ్మెలో వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడడంతో నిన్న జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది






