బస్సు సౌకర్యం కాలనీ వాసులకు వరం చిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ 11వ డివిజన్ పరిధిలోని సూరజ్ నగర్ ప్రాంతానికి ఆర్టిసి బస్సు సౌకర్యం కల్పించడం స్థానిక ప్రజలకు వరంగా మారుతుందని సీనియర్ బిఆర్ఎస్ నాయకులు చిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం సూరజ్ నగర్ కాలనీ నుంచి బోడుప్పల్ మీదుగా సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ సిటీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సూరజ్ నగర్ నుంచి సికింద్రాబాద్కు ప్రతిరోజూ వందలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు, మహిళలు ప్రయాణం చేస్తారని,
కానీ ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం లేకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తమ ఇబ్బందులను ఆర్టీసీ అధికారులకు తెలపడంతో స్పందించిన అధికారులు తమ కాలనీ నుంచి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కాలనీవాసులు సైతం ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకొని సౌకర్యవంతంగా ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, కాలనీవాసులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




