ఇరు వర్గాల మధ్య ఘర్షణ కేసు నమోదు
రెండు వర్గాలపై బైండ్ ఓవర్ చర్యలు
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న, ఘర్షణ ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రజల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేలా ఇరువర్గాల వ్యక్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా, నిరోధించేందుకు చట్టపరమైన చర్యల్లో భాగంగా ఇరువర్గాల వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వ్యక్తిగత లేదా వర్గాల మధ్య తలెత్తే వివాదాలను చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించకుండా,వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు, గొడవలు, దాడులు, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ఎలాంటి చర్యలనైనా పోలీసులు కఠినంగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ప్రజలందరూ పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగిస్తూ, చట్టాన్ని గౌరవించి పోలీసులకు సహకరించాలని కొత్తగూడెం 3 టౌన్ పోలీసులు కోరుతున్నారు.






