21-02-2026 01:58:06 AM
రవితేజతో కలిసి ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన మరాఠా మందారం భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినప్పటికీ ఆ తర్వాత విజయ్ దేవరకొండకు జోడీగా ‘కింగ్డమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా కూడా ఆమెకు సంతృప్తికరమైన విజయాన్ని ఇవ్వలేకపోయింది.
ఇక మూడో సినిమాగా రామ్ పోతినేనితో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’లో జత కట్టింది. ఆ సినిమా ఫలితం కూడా భాగ్యశ్రీ ఖాతాలో హిట్ టాక్ను నమోదు చేయలేకపోయింది. అలా తాను నటించిన మూడు సినిమాలు వరుసగా ప్లాప్ కావటం భాగ్యశ్రీ బోర్సేను ఒకింత నిరుత్సాహానికి గురిచేశాయి. అయినప్పటికీ ఈ భామకు అవకాశాలేమీ తగ్గకపోటం విశేషం. భాగ్యశ్రీ ప్రస్తుతం అక్కినేని యువ హీరో అఖిల్తో ‘లెనిన్’ సినిమాలో నటిస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మేకర్స్ త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే, ఈ మూవీ సెట్స్పై ఉండగానే మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది భాగ్యశ్రీ. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. ‘ఏజెంట్ సాయి’, ‘శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాల దర్శకుడు స్వరూప్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలోనే భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైందని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.