పీఏడీపై అవగాహన అత్యవసరం
కరీంనగర్,(విజయక్రాంతి): పి.ఏ.డి అనేది కాళ్లకు, పాదాలకు వెళ్లే రక్తనాళాలు ఇరుకుగా లేదా మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణ తగ్గిపోవడం అని తెలిపారు. డయాబెటిస్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండి, చిన్న గాయాలు కూడా మానకుండా పుండ్లుగా మారే ప్రమాదం ఉందన్నారు. యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ ప్రముఖ వైద్యులు డా.డా.ప్రభాకర్ మాట్లాడుతూ, డయాబెటిస్ ఉన్నవారిలో పిరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (పి.ఏ.డి) సమస్య వేగంగా పెరుగుతోందని ఆయన వివరించారు. నరాల సమస్య కారణంగా కొందరిలో నొప్పి కూడా తెలియకపోవచ్చని హెచ్చరించారు.
నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, కాళ్లు త్వరగా అలసిపోవడం, పాదాలు చల్లగా ఉండటం, మానని గాయాలు, వేళ్లు నల్లబడటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సకాలంలో కాళ్ల రక్తపోటు పరీక్ష, డాప్లర్ స్కాన్ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. డయాబెటిస్ రోగులు రక్త చక్కెరను కట్టుదిట్టంగా నియంత్రించుకోవాలని, పొగతాగడం పూర్తిగా మానాలని, అవసరమైతే మందులు లేదా యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్రతి రోజు పాదాలను పరిశీలించడం, గాయాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ముందస్తు అవగాహన, సకాలంలో చికిత్సతో కాలు కోల్పోయే ప్రమాదాన్ని పూర్తిగా నివారించవచ్చని డా.ప్రభాకర స్పష్టం చేశారు. ఈసందర్బంగా కరీంనగర్ జిల్లా వాసులకు ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం,10 గంటలకు సాయంత్రం 4 గంటల వరకు ,యశోద మెడికల్ సెంటర్ లో ఓపిడీలు నిర్వహించబడుతున్నాయి ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ప్రభాకర్ తో పాటు యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ సిబ్బంది నవీన్ చక్రవర్తి, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.






