అమనగల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం
* విద్యార్థులతో ప్రతిజ్ఞ
అమనగల్,(విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అమనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. అమనగల్ ఎస్హెచ్ఓ ఎస్.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబాలు ఎలా నాశనమవుతాయో వివరించారు.
ఎన్డీపీఎస్ చట్టం–1985 ప్రకారం డ్రగ్స్ వాడినా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు వీటికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి, యాంటీ డ్రగ్స్ హెల్ప్లైన్ (1908) వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.






