అంబేద్కర్ చదివిన చదువు సమ సమాజ నిర్మాణం కోసం: ఎమ్మెల్యే జాదవ్
14-04-2026 03:32 PM
బోథ్,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 32 డిగ్రీలను పూర్తి చేసి సమ సమాజ నిర్మాణం కోసం రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశారని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు. మంగళవారం బోథ్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమంలో మాట్లాడారు.అంబేద్కర్ ఉన్నత లక్ష్యాలతో భావితరాల కోసం రాజ్యాంగాన్ని రచించారన్నారు. మనం భారతదేశంలో పుట్టడమే గొప్ప అదృష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు సేఫ్టీ నిబంధనలపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులతోపాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచులు పాల్గొన్నారు.






