భారత్ పర్యటనకు ఆప్ఘనిస్థాన్
షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ
ముంబై, మార్చి 2: ప్రస్తుతం టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్లో బిజీగా ఉంది. ఇది ముగిసిన మూడు వారాలకు ఐపీఎల్ హడావుడి మొదలువుతుంది. మే నెలాఖరు వరకూ ఐపీఎల్ జరగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు అంతర్జాతీయ సిరీస్ లతో బిజీ కానుంది. దీనిలో భాగంగా జూన్ నెలలో ఆప్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
ఈ టూర్లో ఆప్ఘనిస్థాన్ భారత్తో ఒక టెస్ట్, మూడు వన్డే మ్యాచ్లు ఆడనుంది.. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ను బీసీసీఐ రిలీజ్ చేసింది. ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు న్యూ చంఢీగడ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది.
ఈ మైదానంలో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే. జూన్ 14, 17, 20వ తేదీల్లో వన్డే మ్యాచు లు జరగనున్నాయి. వన్డే సిరీస్కు ధర్మశాల, లక్నో , చెన్నై ఆతిథ్యమివనున్నాయి. భారత్, ఆప్ఘనిస్థాన్ జట్లు 2018లో ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ఫార్మాట్లో ఈ రెండు దేశాలు పోటీ పడలేదు. అలాగే భారత్తో ఆఫ్ఘానిస్తాన్ చివరిసారి జనవరి 2024లో మూడు టీ20ల సిరీస్లో తలపడింది.
కాగా ఇప్పుడు మళ్లీ రెండు జట్ల మధ్య మొదటి పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సిరీస్ జరగనుంది. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ద్వారా భారత స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీతో కనిపించనున్నారు. టెస్ట్, టీ20లకు గుడ్ బై చెప్పిన వీరిద్దరూ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోకో జోడీ ఈ మధ్య కాలంలో జరిగే దాదాపు అన్ని సిరీస్లోనూ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.




