Warangal Sub-Registrar Officeలో సోదాలు.. అక్రమాల గుట్టు విప్పిన ఏసీబీ
హైదరాబాద్: వరంగల్లోని సబ్-రిజిస్ట్రార్(Warangal Sub-Registrar office) కార్యాలయంలో అవకతవకలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లెక్కల్లో చూపని రూ.47,450 నగదుతో పాటు, 70 నమోదు కాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు సమయంలో కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. డాక్యుమెంట్ రైటర్ల సెల్ ఫోన్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. డాక్యుమెంట్ రైటర్లతో జరిగిన ఫోన్ పే లావాదేవీలను బయటపెట్టారు.
ఏడాది కాలంలో సుమారు రూ. 42 లక్షల మేర ఫోన్ పే (PhonePe) లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 204 డెలివరీ కాని డాక్యుమెంట్లు ఎస్ఆర్ వోల వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఎస్ఆర్ వోలు రామ నర్సింహారావు, ఆనంద్ మధ్య వాట్సాప్ చాట్ బహిర్గతం చేశారు. ఎస్ఆర్వోలు రామ నర్సింహారావు, ఆనంద్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎస్ఆర్వోల ఇళ్లలో రూ. 24.61 లక్షల నగదు, 820 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్ వో దావులూరి ఆనంద్ కు 'కపిల్ చిట్స్'లో రూ. 30.10 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆకస్మిక తనిఖీ సందర్భంగా మరికొన్ని ఇతర అవకతవకలను కూడా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.




