దక్షిణాసియా వస్త్ర రాజధానిగా తెలంగాణ — సీఎం రేవంత్ రెడ్డి
- టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదు.. చేనేతలకు జీవితం
- పర్యావరణ పరిరక్షణే మా తొలి ప్రాధాన్యత
- చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం
- ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్
హైదరాబాద్: దక్షిణాసియా టెక్స్ టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో జరిగిన 13వ ఆసియా టెక్స్ టైల్స్ సదస్సు(Asian Textile Conference)- ATEXCON 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఉత్తమ వస్త్రాల రూపకల్పనలో భారత్ కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు. టెక్స్ టైల్స్ కేవలం పరిశ్రమే కాదన్న ముఖ్యమంత్రి చేనేతలకు జీవితం అన్నారు. వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సూచించారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే ఫిల్మ్ ప్రొడక్షన్ డెస్టినేషన్ గా హైదరాబాద్ మారిందని, చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణే తమ తొలి ప్రాధాన్యతని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు నిర్మిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను నేతన్నలు ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేత పరిశ్రమపై వేలాది మంది ఆధార పడ్డారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. చేనేతల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున సహకరిస్తోందని తెలిపారు. చేనేతలకు తమ ప్రభుత్వం చేతినిండా పని కల్పిస్తోందని తుమ్మల హామీ ఇచ్చారు.




