మణికొండ మాజీ వైస్ చైర్మన్ ఇంట్లో ఏసీబీ సోదాలు
భారీగా నగదు, కీలక డాక్యుమెంట్ల గుర్తింపు
14 మంది అధికారులతో కొనసాగుతున్న సోదాలు
మణికొండ జూలై 2 (విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్రెడ్డి(DSP Bhimreddy) కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మణికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో దాదాపు 14 మంది ఏసీబీ అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. భీమ్రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు అన్నీ నరేందర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేశారు.
ఈ సోదాల్లో ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. భీమ్రెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, బినామీ ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన దస్త్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చట్టానికి దొరకకుండా ఆధారాలను ఇక్కడ దాచారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడులతో కీలక ఆధారాలు లభిస్తుండటంతో భీమ్రెడ్డి కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. నరేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.






