రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి.. సత్తుపల్లిలో ‘ఇందిరమ్మ రేవంత్రెడ్డి కాలనీ’ ప్రారంభం
సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలనీ సత్తుపల్లి నియోజకవర్గంలో రూపుదిద్దుకుంది. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల సముదాయానికి *‘ఇందిరమ్మ - రేవంత్ రెడ్డి కాలనీ‘ గా నామకరణం చేస్తూ నేడు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
సత్తుపల్లి నియోజకవర్గంలో సరికొత్త ఒరవడి
ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే వారి పేరు మీద కాలనీకి నామకరణం చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ప్రజా సంక్షేమ పాలనకు నిదర్శనంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ మట్టా దయానంద్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పైలెట్ ప్రాజెక్ట్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా కొత్తూరు గ్రామాన్ని మోడల్ గ్రామంగా ఎంపిక చేసి, అత్యాధునిక వసతులతో ఈ కాలనీని నిర్మించారు. నేడు జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులు తమ నూతన గృహాల్లోకి ప్రవేశించారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా నేతలు పునరుద్ఘాటించారు.




