శత్రువులు కూడా అభినందించే గొప్ప నాయకుడు "వైఎస్సార్"
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
షాద్ నగర్ లో వైయస్సార్ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ
షాద్ నగర్,(విజయక్రాంతి): వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూక్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన వర్ధంతి సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి గ్రామాల నుండి పెద్ద ఎత్తున వైయస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్ధంతి సభలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం.. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అని కొనియాడాడు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 2009వ సంవత్సరం, సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతూ నల్లమల అటవీ ప్రాంతంలోని పావురాలగుట్టలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని, 2004 నుంచి 2009 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయారన్నారు.






