యాప్రాల్లో యువకుడు అదృశ్యం
జవహర్ నగర్,(విజయక్రాంతి): తల్లి మందలించిందనే చిన్న కారణంతో 18 ఏళ్ల యువకుడు ఇల్లు వదిలి వెళ్లిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. యాప్రాల్లోని ఎస్.ఎస్. ఎన్క్లేవ్ (ఫేజ్-II) నివాసి, ప్రైవేట్ ఉద్యోగి అయిన ప్రశాంతి స్టీఫెన్ కుమారుడు ఆరోన్ జోర్డాన్ స్టీఫెన్ (18) విద్యార్థిగా చదువుకుంటున్నాడు.
ఈ నెల 4వ తేదీ రాత్రి సుమారు 9:00 గంటల సమయంలో చెల్లెలి కోసం స్టేషనరీ సామగ్రి తీసుకురావాలని తల్లి కోరగా, అతడు నిరాకరించాడు. దీంతో తల్లి అతడిని మందలించడంతో కోపానికి గురైన ఆరోన్, "నేను ఇంటి నుండి వెళ్లిపోతున్నాను" అని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం అతడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద పరిసర ప్రాంతాల్లో గాలించారు. యాప్రాల్లోని ఉషోదయ, శైలి గార్డెన్ సమీపంలో అతడిని చివరిసారిగా చూసినట్లు స్థానికులు తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో తల్లి ప్రశాంతి స్టీఫెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.






