ఈజీ మనీ.. ప్రాణహాని
ఆన్లైన్ గేమ్స్.. అంతా కొల్లాప్స్..
సర్వం కోల్పోయి
అప్పుల్లో కూరుకుపోతున్న వైనం
తీవ్రవత్తిడితో ఆత్మహత్యలకు
పాల్పడుతున్న యువత
తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలంటున్న నిపుణుల
సూర్యాపేట ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : నేరేడుచర్లకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేవాడు. వాటికి అలవాటు పడిన అతను తనకి తెలిసిన వారి వద్ద లక్షల రూపాయలు అప్పు తీసుకుని వాటిని పోగొట్టాడు. ఇంట్లో చెబితే ఏమంటారో అని భయపడి ఎవరికి చెప్పకుండా కొన్నాళ్ళు ఒత్తిడితో జీవించాడు. తదుపరి అప్పులు ఇచ్చివారి ఒత్తిడి మరింత పెరగడంతో ఏమీ అర్థంకాక చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి గతంలో ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారాడు. తెలిసిన వాళ్లు, బంధుమిత్రుల దగ్గర అప్పులు చేస్తూ వాటిని గేమ్స్ లో పెట్టుబడిగా పెట్టాడు. తీవ్రంగా నష్టపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈజీగా మనీ సంపాదించాలన్న అత్యాశతో యువత అడ్డదారులు తొక్కుతున్నారు. తక్కువ టైంలో ఒకేసారి రూ. లక్షలు, రూ. కోట్లు సంపాదించాలని ఆశతో పెట్టుబడులు పెట్టి సర్వం కోల్పోతున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్స్ ట్రాప్ లో పడి చదువు. కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు చేసిన అప్పులతోపాటు పరువు పోతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇలాంటి ఘటనలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవల ఎక్కువయ్యా యి. సాధారణంగా ఇలాంటి గేమ్స్ లో వచ్చేదాని కన్నా పోగొట్టుకునేదే ఎక్కువగా ఉంటోంది. కాగా రాష్ట్రంలో కొన్ని ఆన్లైన్ బెట్టింగ్స్, గేమింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఎలాంటిరె స్ట్రిక్షన్ లేకపోవడంతో కొందరు యువత ఫేక్ వీపీఎన్ ద్వారా లొకేషన్ మార్చి పెట్టుబడులు పెడుతున్నారు. ఇలాంటి వాటిపై తల్లిదండ్రులు తమ పిల్లలను కని పెట్టుకొని ఉండాలని నిపుణలు హెచ్చరిస్తున్నారు.
ఆకర్షిస్తున్న ఆన్లైన్ గేమ్స్
నేటి యువతకు టెక్నాలజీ అరచేతిలోకి వచ్చేసింది. చదువును పక్కన పెట్టి మరీ స్మార్ట్ ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఊరించే ప్రకటనలతో ఆకర్షితులవుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయన్న ఆశతో అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడుతున్నారు.
పీకల్లోతు అప్పుల్లోకి..
మొదట ఫ్రీగేమ్స్ తో వలవేస్తున్న యాప్స్ నిర్వాహకులు వాటికి అలవాటు పడ్డాక ప్రీమియం పేరిట రేట్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. వీటిల్లో గెలిస్తే రూ. లక్షలు, కోట్లు సంపాదించొచ్చని ఆశ పెడుతున్నారు. నమ్మిన కొందరు యువత వలలో చిక్కుకుపోయి ఆర్థికంగా చితికి పోతున్నారు. కుటుంబ సభ్యులందరికీ తెలియకుండా పెట్టుబడులు పెడుతున్నారు. మరికొందరు బయట అప్పులు చేసి మరీ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లో సంపాదించాక అప్పులు చెల్లించవచ్చని, ఆడుతూ పీకల్లోతు అప్పుల్లో కూరు కపోతున్నారు. అంతా కోల్పోయాక ఏమి చేయాలో తెలియక కొందరు ప్రాణం తీసుకుంటున్నారు. మరికొందరు కన్న వారికి చెప్పి ఆస్తులు అమ్మి కడుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
ఆన్లైన్ గేమ్స్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతకు అవగాహనలు కల్పిస్తున్నాం. యువత ఆన్లైన్ గేమ్స్ కు బానిస కావడం వారి భవిష్యత్తుకు ప్రమాదకరం. పిల్లలపై తల్లిదండ్రులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షించాలి. అప్పుడే యువత ఆన్లైన్ గేమ్స్ బారిన పడే అవకాశం ఉండదు.
- చరమందరాజు, సిఐ, హుజూర్ నగర్




