15 March, 2026 | 4:03 PM

ఔను, నేను తప్పులు చేశాను!

15-03-2026 12:00 AM

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ సినీ ప్రయాణంలో తాను చేసిన పొరపాట్ల గురించి ఎంతో ధైర్యంగా, నిజాయితీగా స్పందించారు. ‘దమ్ ల గా కే హైషా’, ‘సాండ్ కీ ఆంఖ్’, ‘బధాయి దో’ వంటి చిత్రాలతో నటిగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భూమి పడ్నేకర్.. కెరీర్ తొలినాళ్లలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘మీ కెరీర్‌లో ఏదైనా పొరపాటు జరిగిందా..?’ అన్న ప్రశ్నకు చాలా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

“ఔను, నేను కొన్ని తప్పులు చేశా. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలపైనే నా కెరీర్ మొత్తాన్ని నిర్మించుకున్నా. కానీ, మధ్యలో కొన్నిసార్లు ఆ రూ.200 కోట్ల భారీ కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఆశ కలిగింది. ఆ ఆశతోనే నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేని సినిమాల్లోనూ నటించా. అదే నేను చేసిన అతిపెద్ద తప్పు. నా సినిమా ఫలితం ఎలా ఉన్నా, కొన్ని విషయాల్లో మాత్రం నేను అస్సలు రాజీ పడను.

స్త్రీలను తక్కువ చేసి చూపే లేదా నా జెండర్‌ను అవమానించే పాత్రలు నేను ఎప్పటికీ చేయను. ఒకవేళ ఆ సినిమాలో నాకు చేసేందుకు పెద్దగా పని లేకపోయినా నాకు నచ్చదు. ఎందుకంటే ప్రేక్షకులు నా నుంచి ఒక బలమైన నటనను ఆశిస్తారు. కష్టపడి సంపాదించుకున్న ఆ గుర్తింపును పక్కన పెట్టి మళ్లీ అలాంటి తప్పులు చేయను” అని ఆమె స్పష్టం చేశారు.

‘కమర్షియల్ సక్సెస్ కోసం తనలోని నటిని చంపుకోనని, ఇకపై అర్థవంతమైన పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానంటూ చెప్పిన భూమి పెడ్నేకర్ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.